చెన్నై : పరస్త్రీ వ్యామోహం వ్యక్తిని ఎంతకైనా తెగించేలా చేస్తుంది. భార్య బంగారాన్ని దొంగిలించి ప్రియురాలికి బహుమతిగా ఇచ్చిన ప్రబుద్ధుడిని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు చెన్నైకి చెందిన శేఖర్ (40) తన సోదరుడు రాజేష్ కుటుంబంతో కలిసి పూనమల్లి ప్రాంతంలో నివసిస్తున్నాడు.
విభేదాల కారణంగా రెండేండ్ల నుంచి శేఖర్ భార్య వేరుగా ఉంటోంది. కొద్దిరోజుల కిందట ఆమె తన బంగారాన్ని తీసుకుని వెళ్లేందుకు మెట్టినింటికి వచ్చింది. ఇంట్లో తన బంగారం కనిపించకపోవడంతో షాక్కు గురైన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తులో శేఖర్ తన భార్యకు చెందిన 300 సవర్ల బంగారు ఆభరణాలతో పాటు తల్లి బంగారం 200 సవర్ల వరకూ చోరీ చేశాడని వెల్లడైంది.
ఈ బంగారాన్ని తన ప్రియురాలు స్వాతి(22)కి బహుమతిగా ఇచ్చాడు. తనతో వివాహేతర సంబంధం సాగిస్తున్న స్వాతి కోసం శేఖర్ కొనిచ్చిన కారును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి దర్యాప్తు ముమ్మరం చేశారు.