దోమలగూడ:చోరికోసం ఇంట్లోకి చొరబడి ఇద్దరు వృద్దులను తీవ్రంగా గాయపర్చిన వ్యక్తిని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. దీనికి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి…..చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని దోమలగూడ గగన్మహల్ కాలనీలో ఓ అపార్ట్మెంట్లో జోష్నా రాణి (66) సీతా భాగ్యలక్ష్మీ (61) ఇద్దరు అక్కాచెల్లెళ్లు నివసిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తి వారి ఇంట్లో చొరబడి మొదట జోష్నా రాణి మెడ పై కత్తి పెట్టి డబ్బులు ఇవ్వాలని లేదంటే పీక కోస్తానని బెదిరించాడు.
భయంతో ఆమె అరవడంతో, వంట గదిలో ఉన్న ఆమె సోదరి సీతా భాగ్యలక్ష్మీ కత్తి తీసుకుని వచ్చింది. ఇది గమనించిన ఆ వ్యక్తి వారిద్దరిపై కత్తితో దాడి చేసి పారిపోతుండగా వృద్దులిద్దరూ గట్టిగా అరిచారు. దీంతో అప్రమత్తమైన వాచ్ మెన్, స్థానికులు సదరు వ్యక్తిని పట్టుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాధితులను చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రికి తరలించి శస్త్ర చికిత్స చేపట్టారు. ప్రస్తుతానికి ఇద్దరు వృద్దులకు ప్రాణాపాయం లేదని వైద్యులు వెల్లడించారు. నిందితుడిని పోలీసులు విచారించడంతో, ప్రకాశం జిల్లాకు చెందిన కోటా నరేందర్ అని తేలింది. దీంతో పోలీసులు అతడి పై 393, 452, 307 ఐపీసీ సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.