రాయ్పూర్ : చత్తీస్ఘఢ్లోని జంజ్గిర్-చంపా జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. మానసిక వికలాంగురాలిపై లైంగిక దాడికి పాల్పడి ఆపై ఆమె ప్రైవేట్ భాగాల్లో ఇనుప రాడ్తో గాయపరచడంతో బాధితురాలు మరణించింది. ఏప్రిల్ 5 అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. దభారా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ కిరాణా దుకాణం ఎదురుగా బెంచ్పై మహిళ నిద్రిస్తుండగా నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు.
నిందితుడు కిషన్ యాదవ్ను గురువారం అరెస్ట్ చేశారు. పోస్ట్మార్టం నివేదికలో మహిళను శారీరకంగా హింసించి లైంగిక దాడికి పాల్పడినట్టు వెల్లడైంది. ఏప్రిల్ 5 అర్ధరాత్రి దాటిన తర్వాత మహిళను నిర్జన ప్రదేశంలోకి తీసుకెళ్లిన కిషన్ యాదవ్ ఆమెపై లైంగిక దాడికి పాల్పడి తలపై రాడ్తో బలంగా కొట్టాడు ఆపై ఆమె ప్రైవేట్ భాగాల్లో ఇనుప రాడ్తో గాయపరిచాడు.
మహిళను అక్కడే వదిలివేసి రక్తపు మరకలున్న షర్ట్ను, ఐరన్ రాడ్ను కల్వర్ట్ సమీపంలో పడేసి నిందితుడు పారిపోయాడు. దుస్తులు, ఇనుప రాడ్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. మహిళ కొన్నేండ్ల కిందట తల్లితండ్రులను కోల్పోగా స్ధానికులు ఇచ్చే ఆహారం తీసుకుంటూ జీవిస్తోంది.