లక్నో : యూపీలో దారుణం జరిగింది. మహిళను కిడ్నాప్ చేసి బలవంతంగా పెండ్లి చేసుకుని రెండు నెలల పాటు లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి ఉదంతం వెలుగుచూసింది. బాధితురాలు ప్రధాన నిందితుడు సహా మరో ఐదుగురిపై శనివారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణ ఘటన బయటపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కాలేజ్లో క్లాస్మేట్స్ అయిన బాధితురాలు, ప్రధాన నిందితుడు ప్రేమించుకుని పెండ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
ఐదు నెలల కిందట వీరిద్దరికీ నిశ్చితార్ధం జరిగింది. అయితే పెండ్లి కొడుకు కుటుంబసభ్యులు కట్నం డిమాండ్ చేశారు. కట్నం కింద రూ 5 లక్షల నగదు, కారు ఇవ్వాలని కోరారు. దీనికి యువతి కుటుంబసభ్యులు నిరాకరించడంతో నిశ్చితార్ధం రద్దయింది. రెండు నెలల కిందట బాధితురాలు బ్యాంకు కు వెళుతుండగా ప్రియుడితో పాటు అతడి కుటుంబ సభ్యులు ఆమెను కిడ్నాప్ చేసి సంభాల్లోని ఓ గుడికి తీసుకువెళ్లి బలవంతంగా వారిద్దరికీ పెండ్లి జరిపించారు.
యువకుడి కుటుంబ సభ్యులు బాధితురాలి తల్లితండ్రులకు ఫోన్ చేసి అంతా సజావుగా జరిగిందని సమాధానపరిచారు. ఆపై భర్త అతడి కుటుంబ సభ్యులు ఆమెపై వేధింపులకు గురిచేశారు. ఆగస్ట్ 5న నిందితుడు తనను అపస్మారక స్ధితిలో తనను తమ గ్రామం వద్ద విడిచిపెట్టి వెళ్లాడని ఫిర్యాదులో బాధితురాలు పేర్కొన్నారు. తనను కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడ్డారని నిందితుడు, అతడి తల్లితండ్రులు, సోదరులు సహా ఆరుగురు వ్యక్తులపై ఆమె ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశామని, నిందితులను త్వరలో అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు.