బెంగళూరు : ఓ అమ్మాయితో యువకుడు చాటింగ్ చేయడాన్ని కొంతమంది జీర్ణించుకోలేకపోయారు. దీంతో ఆ యువకుడిని నలుగురు వ్యక్తులు కలిసి అంతమొందించారు. ఈ దారుణ ఘటన బెంగళూరులో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరుకు చెందిన గోవిందరాజు(20).. తనకు తెలిసిన అమ్మాయితో చాటింగ్ చేస్తున్నాడు. అయితే ఈ విషయాన్ని మరికొంత మంది యువకులు పసిగట్టారు. ఆ అమ్మాయితో గోవిందరాజు చాటింగ్ చేయడం వారికి నచ్చలేదు. ఈ క్రమంలో గోవిందరాజు వద్దకు ఆదివారం ఉదయం అనిల్ అనే యువకుడు వెళ్లి.. బయటకు తీసుకొచ్చాడు. మార్గమధ్యలో మరో ముగ్గురు యువకులు జాయిన్ అయ్యారు. ఇక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి.. గోవిందరాజును అత్యంత దారుణంగా చంపేశారు. అనంతరం కారులో డెడ్బాడీని తీసుకెళ్లి, చార్ముదిఘాట్ ఏరియాలో వదిలేశారు.
అయితే తమ కుమారుడు కనిపించడం లేదంటూ, తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.