తిరువనంతపురం: కేరళలోని ఒక ప్రైవేట్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కొచ్చి కిన్ఫ్రా పార్క్లోని గ్రీన్ లీఫ్ ఎక్స్టెన్షన్స్ అనే పైవేట్ సంస్థలో బుధవారం ఉదయం ఆరు గంటలకు భారీగా మంటలు ఎగసిపడ్డాయి. మార్నింగ్ వాక్ చేస్తున్న కొందరు దీనిని చూసి పోలీసులు, ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో ఐదు అగ్నిమాపక వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఫైర్ సిబ్బంది, స్థానికులు పలు గంటలు శ్రమించి మంటలను అదుపు చేశారు.
కాగా, కంపెనీలోని గ్యాస్ పైప్ లైన్ లీక్ వల్ల అగ్నిప్రమాదం జరిగి ఉంటుందని ఫైర్ ఆఫీసర్ అనుమానం వ్యక్తం చేశారు. ఎలాంటి ప్రాణ ముప్పు జరుగలేదని చెప్పారు. అయితే ఈ ప్రమాదంలో పలువురికి కాలిన గాయాలయ్యాయి. దట్టమైన పొగ వల్ల కొందరు అస్వస్థతకు గురయ్యారు. దీంతో సుమారు 51 మందిని ఎర్నాకుళం వైద్య కాలేజీ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.
కొందరు ఫైర్ సిబ్బంది, సహాయం చేసిన స్థానికులతోపాటు కంపెనీ ఉద్యోగులు కూడా ఆసుపత్రిలో చేరిన వారిలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. అగ్ని ప్రమాదం నేపథ్యంలో ఆ ప్రాంతంలో పొగలు దట్టంగా కమ్ముకున్నాయి. దీంతో ప్రజల ఆరోగ్యం దృష్ట్యా సమీప కంపెనీల్లో సిబ్బందిని ఖాళీ చేయించారు. కాగా, ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది.