ముంబై: ప్రైవేట్ బ్యాంక్ మహిళా అధికారిణిని ఆ బ్రాంచ్ మాజీ మేనేజర్ కత్తితో పొడిచి హత్య చేశాడు. మహారాష్ట్రలోని పాల్గఢ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఐసీఐసీఐ బ్యాంక్ విరార్ తూర్పు శాఖలో గురువారం రాత్రి 8.30 గంటల సమయంలో అసిస్టెంట్ మేనేజర్ యోగితా వర్తక్, క్యాషియర్ శ్రద్ధా దేవుర్కర్ తమ పనిలో బిజీగా ఉన్నారు. ఇంతలో ఆ బ్రాంచ్లో గతంలో పని చేసిన మాజీ మేనేజర్ అనిల్ దుబే, మరోవ్యక్తితో కలిసి అక్కడకు వచ్చాడు. మహిళా అధికారిణులను కత్తితో బెదిరించి బ్యాంక్లోని డబ్బులు, నగలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
దోచుకున్న డబ్బు, బంగారు ఆభరణాలతో అనిల్ దుబే, మరోవ్యక్తి పారిపోతుండగా ఆ ఇద్దరు మహిళలు సైరన్ మోగించడంతోపాటు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో అనిల్ దుబే కత్తితో వారిపై దాడి చేసి పొడిచాడు. యోగితా కుప్పకూలి రక్తం మడుగుల్లో అచేతనంగా పడిపోగా, శ్రద్ధాకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించగా యోగితా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. శ్రద్ధాకు చికిత్స అందిస్తున్నారు.
మరోవైపు బ్యాంక్ బ్రాంచ్ వద్దకు వచ్చిన పోలీసులు పారిపోతున్న అనిల్ దుబేను వెంబడించి పట్టుకున్నారు. కాగా మరో వ్యక్తి తప్పించుకుని పారిపోయాడు. ప్రస్తుతం మరో ప్రైవేట్ బ్యాంకులో పని చేస్తున్న అనిల్ దుబే గతంలో ఈ బ్రాంచ్ మేనేజర్గా ఉన్నప్పుడు కోటి రుణం తీసుకున్నాడని పోలీసులు తెలిపారు. ఆ అప్పును తీర్చలేక మరో వ్యక్తితో కలిసి బ్యాంకు దోపిడీకి ప్రయత్నించాడని, ఈ క్రమంలో అడ్డుకోబోయిన బ్యాంకు మహిళా ఆఫీసర్లు యోగితా, శ్రద్ధాలపై కత్తితో దాడి చేశాడని చెప్పారు. ఆ సమయంలో వారిద్దరే బ్యాంకులో ఉన్నారని అన్నారు.
కత్తి పోటు గాయం వల్ల యోగితా మరణించగా, శ్రద్ధా చికిత్స పొందుతున్నదని పోలీసులు తెలిపారు. నిందితులపై హత్య, హత్యాయత్నం, దోపిడీ వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. పరారీలో ఉన్న మరో వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.