నాగ్పూర్: ఓ 40 ఏండ్ల మహిళ వృత్తిరీత్యా ఆస్పత్రిలో నర్సు. ఎప్పటిలాగే మంగళవారం రాత్రి కూడా విధుల నిమిత్తం ఆస్పత్రికి బయలుదేరింది. మార్గమధ్యలో ఓ వ్యక్తి ఆమెను అడ్డగించాడు. ఆమెకు ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే తన వెంట తెచ్చుకున్న కత్తితో నర్సు ముఖంపైన, చేతులపైన విచక్షణా రహితంగా పొడవడం మొదలుపెట్టాడు. ఇంతలో స్థానికులు అప్రమత్తమై పట్టుకునే ప్రయత్నం చేయగా పారిపోయాడు. తీరా అతను ఎవరు అని ఆరా తీస్తే బాధితురాలి భర్తేనని తెలిసింది. మహారాష్ట్రలోని నాగ్పూర్ నగరంలోగల అజ్ని గ్రౌండ్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. నాగ్పూర్కు చెందిన నర్సు బబిత దూబే (40), సంతోష్ కాలే ఇద్దరూ భార్యాభర్తలు. మొదటి భర్తతో విడిపోయిన ఆమె సంతోష్ కాలేను రెండో పెండ్లి చేసుకుంది. ఈ క్రమంలో సంతోష్ కాలే నిత్యం మద్యం సేవించి వచ్చి బబితను వేధిస్తున్నాడు. వారం రోజుల క్రితం కూడా పూటుగా మద్యం తాగి వచ్చి భార్యతో గొడవపడ్డాడు. తనపై చేయి కూడా చేసుకోవడంతో సంతోష్ను బబిత ఇంట్లోంచి గెంటేసింది. అప్పటి నుంచి అతడిని ఇంట్లోకి రానివ్వడంలేదు.
దాంతో బబితపై కోపం పెంచుకున్న సంతోష్ మంగళవారం రాత్రి దారికాచి కత్తితో దాడికి పాల్పడ్డాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు తీవ్రంగా గాయపడిన బబితను ఆస్పత్రికి తరలించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు.