బెంగళూర్ : ఇద్దరు మైనర్ బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణలపై అరెస్టయిన లింగాయత్ మఠాధిపతి శివమూర్తి మురుగకు ఛాతీ నొప్పి రావడంతో ఆస్పత్రిలో చేర్పించారు. మైనర్ బాలికలపై లైంగిక వేధింపుల ఆరోపణలపై చిత్రదుర్గలోని మురుగ మఠాధిపతి శివమూర్తిని గురువారం పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా తనను అకారణంగా ఈ కేసులో ఇరికించారని ఆయన చెబుతున్నారు.
లైంగిక వేధింపుల కేసులో శివమూర్తితో పాటు మఠంలోని హాస్టల్ వార్డెన్ సహా ఐదుగురిని అరెస్ట్ చేశారు. మఠం నిర్వహించే స్కూల్లో చదువుతున్న 15, 16 సంవత్సరాల బాలికలు శివమూర్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మఠాధిపతి శివమూర్తి తమను మూడేండ్లుగా లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని వారు ఆరోపించారు. బాలికల ఫిర్యాదు ఆధారంగా శివమూర్తిని ప్రశ్నించిన అనంతరం మైసూర్ పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.