వెంగళరావునగర్ : ప్రియురాలి పై ప్రియుడు దాడికి తెగబడ్డాడు. నడి రోడ్డు పై కత్తితో ప్రియురాలి పై విచక్షణారహితంగా దాడి చేశాడు. ప్రియురాలి గొంతు, మెడ పై కత్తితో పొడిచాడు. హైదరాబాద్ ఎర్రగడ్డలో పట్టపగలు ఈ దారుణం జరిగింది. ఎస్సై రమేష్ తెలిపిన వివరాల ప్రకారం..
శ్రీకాకుళానికి చెందిన సూర్యనారాయణ, డి.శ్యామల (35)కు 2007లో పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. ఉపాధి కోసం దంపతులు హైదరాబాద్ ఎర్రగడ్డకు వచ్చారు. పెళ్ళైన ఏడాదికి తొలి సంతానంగా బాబు, అ తర్వాత రెండో సంతానంగా ఆడపిల్ల పుట్టింది. ఆడపిల్ల పుట్టిందని నెపంతో 2009లో భర్త ఇల్లు వదిలి ఎటో వెళ్లిపోయాడు.
శ్యామల ఇండ్లల్లో పాచిపనులు చేసుకుంటూ తన ఇద్దరు పిల్లల్ని పోషించుకుంటుంది. 2016లో ఎర్రగడ్డ సుల్తాన్ నగర్కు చెందిన సైకిల్ మెకానిక్ షాపు నిర్వాహకుడు సయ్యద్ ఖలీల్ (34)తో పరిచయం ఏర్పడింది. క్రమేణా ఆ పరిచయం వారిద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది.
కాగా 2017లో ఓ హోటల్లో వంటమనిషిగా పనిచేసే శ్రీశైల్ కోట్ (36) అనే వ్యక్తిని రెండో వివాహం చేసుకుంది. వీరికి ఒక బాబు పుట్టాడు. పెళ్లయ్యాక కూడాప్రియుడ్ని రహస్యంగా కలుసుకునేది. కానీ తాను మరో పెండ్లి చేసుకున్న విషయాన్ని ప్రియుడికి చెప్పకుండా దాచి పెట్టింది. అంతేకాకుండా గత ఆర్నెల్లుగా ప్రియుడ్ని దూరం పెట్టసాగింది.
తనకు తెలియకుండా శ్యామల మరో వివాహం చేసుకున్న విషయం తెల్సుకున్న ప్రియుడు ఆమె పై పగబట్టాడు. పథకం ప్రకారం ఆదివారం ఎర్రగడ్డ సండే మార్కెట్లో మూడు కత్తులను కొనుగోలు చేశాడు. మంగళవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో ఆమె గౌతమ్పురి కాలనీలో నడుచుకుంటూ వెళ్తుండగా చెట్టుచాటున నక్కి కాపుకాశాడు.
ఆమె సమీపించగానే ఆమెకు ఎదురుగా అడ్డు నిలబడి కత్తితో ఆమె గొంతు, మెడ పై వేటు వేశాడు. ప్రియుడి దాడి నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు ఆమె పరుగులు తీసింది. కానీ తీవ్ర రక్తస్రావం కావడంతో కొద్ది దూరంలోనే ఆమె కుప్పకూలిపోయింది. గాయాలతో కదల్లేక ఉన్న ఆమె చనిపోయిందని భావించి ఖలీల్ అక్కడి నుంచి పారిపోయాడు.
ఈ దాడి దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. సీసీటీవీ ఫుటేజిను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. క్లూస్ టీమ్ పోలీసులు రంగంలోకి దిగి..ఘటనా స్థలంలో లభించిన ఆధారాలను పోలీసులు సేకరించారు. కాలనీ నడిరోడ్డు పై ఓ వివాహిత పై దాడి జరుగుతుంటే కనీసం ఏ ఒక్కరూ కూడా అడ్డుకోలేదు. కిటికీలు, తలుపులు మూసేసుకున్నారు.
ఆ కిరాతకుడు వెళ్లిపోయాక. ఇళ్లలోంచి బయటకు వచ్చిన జనం 108 అంబులేన్సుకు సమాచారమిచ్చారు. తీవ్రగాయాలతో ఉన్న శ్యామలను పోలీసులు గాంధీ దవాఖానాలో చేర్చారు. నిందితుడు ఖలీల్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తనను దూరం పెట్టడమే కాకుండా..తనకు చెప్పకుండా మరో పెండ్లి చేసుకోవడం వల్లే తాను ఈ దురగతానికి పాల్పడ్డానని నిందితుడు ఖలీల్ తమ విచారణలో అంగీకరించినట్టు పోలీసులు చెప్పారు.