మారేడ్పల్లి : ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిని గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేసిన సంఘటన గోపాలపురం పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ సాయి ఈశ్వర్గౌడ్, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం…రెజిమెంటల్బజార్లోని నీలిమా కిరాణాస్టోర్ ప్రాంతంలో శ్రీనివాస్, ఉమా దంపతులు నివాసం ఉంటున్నారు.
వీరికి తరుణ్ , కీర్తన (3) అనే పిల్లలు ఉన్నారు. శ్రీనివాస్ రెజిమెంటల్ బజార్లోని అక్వేరియం షాపులో పని చేస్తున్నాడు. గురువారం మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో కీర్తనకు అన్నం పెట్టేందుకు ఉమా కిచెన్లోకి వెళ్లింది. అన్నం తీసుకుని వచ్చే లోపు కీర్తన మొదటి అందస్తు నుంచి కిందకు వచ్చింది.
అయితే తల్లి బయటయకు వచ్చి చూసే సరికి పాప కనిపించలేదు. ఎక్కడ వెతికినా లాభం లేకపోవడంతో వారు వెంటనే గోపాలపురం పోలీసు స్టేషన్లో ఫిర్యాధు చేయడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. పాపను ఎవరైనా కిడ్నాప్ చేశారా? లేక ఎవరైనా వెంట తీసుకువెళ్లారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సీసీ కెమెరాల ఆధారంగా పాప ఆచూకీ కోసం గాలిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నారు.