కొచ్చి: వరకట్న వేధింపులు ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. భర్త, అత్తమామల వేధింపులు భరించలేక ఓ లా విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. కేరళ రాష్ట్రం ఎర్నాకుళం జిల్లా అళువాలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. అళువా ఏరియాకు చెందిన మౌఫియా పర్వీన్ (21) అత్తవారింట్లో ఉంటూ ఎల్ఎల్బీ చదువుతున్నది. అయితే గత కొన్ని రోజులుగా భర్త, అత్తమామలు ఆమెను అదనపు కట్నం కోసం వేధించడం మొదలుపెట్టారు.
దాంతో పర్వీన్ ఇప్పటికే జాతీయ మహిళా కమిషన్కు, కేరళ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేసింది. అదేవిధంగా ఈ నెల 11న స్థానిక పోలీసులకు కూడా కంప్లెయింట్ ఇచ్చింది. అయినా, అత్తింటివారి వరకట్న వేధింపులు తగ్గకపోవడంతో మనస్తాపానికి గురై ఇవాళ ఇంట్లోనే ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా ప్రాంతానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు.
మృతురాలి నుంచి ఓ సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. భర్త, అత్తమామలు తనను వరకట్నం కోసం వేధిస్తున్నారని, ఈ విషయమై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినా స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించాడని పర్వీన్ తన సూసైడ్ నోట్లో రాసింది. కాగా, ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, పోస్టుమార్టం నివేదిక అధారంగా తదుపరి దర్యాప్తు కొనసాగిస్తామని పోలీసులు తెలిపారు.