Crime News | కర్ణాటకలోని మైనింగ్ అండ్ జియాలజీ విభాగంలో డిప్యూటీ డైరెక్టర్గా పని చేస్తున్న ప్రతిమ (45) శనివారం రాత్రి బెంగళూరులోని తన నివాసంలో హత్యకు గురయ్యారు. శనివారం విధులు పూర్తయిన తర్వాత ఆమెను ఇంటి వద్ద దిగబెట్టానని ప్రతిమ కారు డ్రైవర్ తెలిపారు. ఎనిమిదేండ్లుగా సుబ్రమణ్యపొరాలోనే నివసిస్తున్నారు. ఆమె శనివారం రాత్రి 8.30 గంటల సమయంలో హత్యకు గురై ఉంటారని భావిస్తున్నారు. ఆమె భర్త, కొడుకు.. శివమొగ్గ జిల్లాలోని థీర్థహల్లీలో ఉంటున్నారు. ఆమెను ఎవరో కత్తితో పొడిచి చంపినట్లు తెలుస్తున్నది.
ప్రతిమ సోదరుడు ఆదివారం ఉదయం ఆమె నివాసానికి రాగా, ఆమె హత్యకు గురైనట్లు గుర్తించారు. రాత్రి ఫోన్ చేసినా ఆమె స్పందించకపోవడంతో వెంటనే పోలీసులను సంప్రదించారు. మామూలుగా శనివారం రాత్రి ఎనిమిది గంటలకు ప్రతిమ ఇంటికి చేరుకున్నారు. కానీ ఆమె అన్న శనివారం రాత్రి, ఆదివారం ఉదయం ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. దీంతో తమకు ఆయన సమాచారం ఇచ్చారని బెంగళూరు సౌత్ డివిజన్ డీసీపీ రాహుల్ కుమార్ సహాపుర్వాద్ తెలిపారు. ఘటనా స్థలం వద్ద ఫోరెన్సిక్, టెక్నికల్ టీమ్స్ ఆధారాలు సేకరించాయని, ఈ కేసు దర్యాప్తు కోసం మూడు టీమ్స్ ఏర్పాటు చేశామని చెప్పారు.