బెంగళూరు : మద్యానికి బానిసగా మారిన తండ్రిని తనయుడు అతి కిరాతకంగా నరికి చంపాడు. తండ్రిని హత్య చేసిన అనంతరం అతని శరీరాన్ని 32 ముక్కలుగా నరికేశాడు. ఆ తర్వాత శరీర భాగాలను బోర్వెల్లో పడేశాడు. ఈ దారుణ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బాగల్కోట్ జిల్లాలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. పరుశురామ్ కులాలి(53) అనే వ్యక్తికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే పరుశురామ్ తాగుడుకు బానిస కావడంతో.. అతనికి భార్య దూరంగా ఉంటోంది. పెద్దకుమారుడితో ఆమె కలిసి ఉంటోంది. మిగతా ఇద్దరు పిల్లలు పరుశురామ్తో ఉంటున్నారు. డిసెంబర్ 6వ తేదీన పీకల దాకా మద్యం సేవించి ఇంటికి వచ్చాడు పరుశురామ్. పిల్లలతో గొడవ పెట్టుకున్నాడు. సహనం కోల్పోయిన కుమారుడు విఠల(20), తండ్రిని ఇనుపరాడ్తో మోది చంపాడు. అనంతరం తండ్రి శరీరాన్ని 32 ముక్కలు చేసి, బోర్వెల్లో పడేశాడు.
పరుశురామ్ మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విఠలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. తండ్రిని తానే చంపానని, శరీర భాగాలను బోర్వెల్లో పడేశానని పోలీసులకు తెలిపారు. జేసీబీల సహాయంతో పరుశురామ్ శరీర భాగాలను పోలీసులు బయటకు తీశారు. విఠలను జైలుకు తరలించారు.