రాంచీ: ప్రభుత్వ స్కూల్ ప్రిన్సిపాల్, ప్యూన్ కర్రలతో కొట్టుకున్నారు. జార్ఖండ్లోని పాలము జిల్లాలో ఈ ఘటన జరిగింది. మేదినీనగర్లోని జిల్లా పాఠశాలకు చెందిన ప్రిన్సిపాల్ కరుణాశంకర్ సరిగా పని చేయని ప్యూన్ హిమాన్షు తివారీపై శుక్రవారం మండిపడ్డాడు. రోజూ ఆలస్యంగా రావడం, ఏ పని చేయకుండా ఖాళీగా ఉండటం, స్కూల్ను శుభ్రం చేయకపోవడం, మొక్కలకు నీళ్లు పోయకపోవడం, కొంత సేపటి తర్వాత ఇంటికి వెళ్లిపోవడంపై ప్రశ్నించాడు. దీంతో తివారీ కూడా ప్రిన్సిపాల్పై ఎదురుతిరిగాడు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య మాటామాటా పెరిగి వాగ్వాదానికి దారి తీసింది. ఇద్దరు చేతులతో కలర్ పుచ్చుకుని తోసుకున్నారు. తర్వాత కర్రలు చేతపట్టారు. కొందరు టీచర్లు, స్కూల్ సిబ్బంది చూస్తున్నప్పటికీ ఎవరూ వెనక్కి తగ్గలేదు. ఈ ఘర్షణలో తివారీ చేతికి స్వల్ప గాయమైంది.
కాగా, ప్రిన్సిపాల్ కరుణా శంకర్ తనపై చేసిన ఆరోపణలను ప్యూన్ హిమాన్షు తివారీ ఖండించాడు. తాను ఉదయం ఆరింటికే స్కూల్కు వచ్చానని, ప్రిన్సిపాల్ అకారణంగా తనపై కర్రతో దాడి చేసినట్లు తెలిపాడు. తాను ప్యూన్ కావడం వల్ల తన లాంటి వారికి గౌరవం ఇవ్వరంటూ వాపోయాడు. ప్రిన్సిపాల్ అవినీతికి పాల్పడ్డాడని, ఇటుకలు, కలప, ఇనుమును స్కూల్ హాస్టల్ కోసం అమ్ముకున్నాడని ఆరోపించారు. కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.