Crime News | భోపాల్ : తన భార్య పొరుగింటి వ్యక్తిని గుట్కా అడిగిందని.. భర్త గొంతు, మణికట్టు కోసుకున్నాడు. తీవ్ర గాయాలపాలైన ఆ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని బేతుల్ జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. బేతుల్ జిల్లాకు చెందిన శివకుమార్ రాథోడ్(35) మూడేండ్ల క్రితం పూజ అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. శివకుమార్ కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పూజకు గుట్కా నమిలే అలవాటు ఉంది. దీంతో ఆదివారం రాత్రి పొరుగింటి వ్యక్తి వద్ద గుట్కా తీసుకుంది. ఈ విషయం భర్త శివరామ్కు తెలిసింది. గుట్కా కావాలని తనను అడగొచ్చు కదా? అని పూజను భర్త నిలదీశాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.
అనంతరం శివరామ్ బయటకు వెళ్లి పీకల దాకా మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. మళ్లీ భార్యతో గొడవ పడ్డాడు. గొడవ మరింత తీవ్రం కావడంతో సమీపంలో ఉన్న తన సోదరుడికి పూజ సమాచారం అందించింది. పూజ సోదరుడు అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు చేరుకునే లోపే శివరామ్ బ్లేడ్తో గొంతు, మణికట్టు కోసుకున్నాడు. తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న శివరామ్ను ఆదివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో పోలీసులు చికిత్స నిమిత్తం బేతుల్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే మద్యం మత్తులో శివరామే గొంతు కోసుకున్నాడా..? లేక ఎవరైనా దాడి చేశారా? అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.