మొయినాబాద్ : ఇంజినీరింగ్ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు, తోటి విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లాకు చెందిన గజ్జల కృష్ణవిజయభాస్కర్ రాజు (20) మొయినాబాద్ మండల పరిధిలోని అమ్డాపూర్ కూడలి వద్ద ఉన్న జేబీఐఈటీ కళాశాలలో బిటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. కళాశాలలో అడ్మిషన్ తీసుకున్న తరువాత కళాశాలలోని హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నాడు. శనివారం ఉదయం 9.30 గంటల సమయంలో విద్యార్థులంతా తరగతులకు వెళ్లాక హాస్టల్ గదిలో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొద్ది సేపటి తరువాత హాస్టల్ సిబ్బంది గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని కిందకు దింపి ఉస్మానియా మార్చురీకి తరలించారు.
మందలింపే కారణం..
హాస్టల్లో భోజనం మంచిగా పెట్టడం లేదని విద్యార్థి రాజు తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పాడు. దీంతో వార్డెన్ మీ తల్లీదండ్రికి ఎందుకు ఫోన్ చేశావని విద్యార్థిని మందలించాడని తోటి విద్యార్థులు తెలిపారు. దీంతో విద్యార్థి తీవ్ర మన స్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని, వార్డెన్ బెదిరింపులు.. యాజమాన్యం నిర్లక్ష్య దోరణితోనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడని తోటి విద్యార్థుల ఆరోపిస్తున్నారు. విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని తోటి విద్యార్థులు విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టారు. విద్యార్థి ఆత్మహత్యతో కళాశాలలో ఘర్షణ వాతావరణం నెలకొన్నది. దీంతో పోలీసులు బలగాలు ముమ్మరంగా మోహరించాయి. ఆత్మహత్య జరిగిన కొన్ని నిమిషాల వ్యవధిలో మృతదేహాన్ని కళాశాల ఆవరణం నుంచి పోస్టుమార్టంకు తరలించడంపై పలు అనుమానాలు నెలకొన్నాయి. దీంతో విద్యార్థులు ఆందోళనకు దిగడంతో కళాశాలలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది.
విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని ఆందోళన
తల్లిదండ్రులు రాకుండానే పోలీసులు ఉరి విప్పి వెంటనే పోస్టుమార్టం కోసం ఉస్మానియాకు తరలించడం ఏమిటని తోటి విద్యార్థులు, విద్యార్థి సంఘాలు ప్రశ్నించారు. మృతుడి కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించమని విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు భీష్మించి కుర్చున్నారు. విద్యార్థి ఆత్మహత్యకు కారకులైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. వారు ఆందోళన విరమించకపోవడంతో పోలీసులు విద్యార్థులను బలవంతంగా అరెస్టు చేసి రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని తెలిపారు.