దేవరుప్పుల : కోలుకొండ చెక్డ్యాంలో చేపల వేటకు వెళ్లిన ఐదుగురు వ్యక్తుల్లో అదే గ్రామానికి చెందిన కన్న యాదయ్య(50) డ్యాంలో ఉన్న నీటి గుంటలో పడి గల్లంతయ్యాడు. గ్రామానికి చెందిన ముత్యాల కుమారస్వామి, బిట్ల శ్రీను, పస్పోజు రాములు, చింతకింది యాకయ్యతో పాటు కన్న యాదయ్య గురువారం మధ్యాహ్నం చేపల వేటకు వెళ్లారు. కాగా కన్న యాదయ్య నీటిలో దిగి వల వేయవలసిందిగా మిగితా స్నేహితులు కోరడంతో నీటిలోకి దిగాడు. దిగిన నీటి స్థలంలో బుడుగు ఉండండతో అందులో కూరుకుపోయి ఎంత సేపైన బయటకు రాలేదు. అప్పటికే చీకటి పడటంతో వెతికే అవకాశం లేకపోవడంతో గ్రామస్తులకు విషయం తెలిపారు.
శుక్రవారం ఉదయం గ్రామస్తులు గాలించగా కన్న యాదయ్య మృతదేహం దోరకడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. కాగా యాదయ్య కుమారుడు అనిల్ ఫిర్యాదు మేర కేసు నమోదు చేసిన ఎస్సై రాజు దర్యాప్తు చేపట్టారు. యాదయ్య మృతదేహం పోస్టుమార్టం నిమిత్తం జనగామ ఏరియా దవఖానకు తరలించగా పోస్టుమార్టం అనంతరం గ్రామంలో అంత్యక్రియలు జరపనున్నట్టు సర్పంచ్ కుర్నాల రవి తెలిపారు. కాగా కన్న యాదయ్యకు భార్య సోమలక్ష్మితో పాటు కుమారుడు అనిల్, కూతురు స్వప్న ఉన్నారు.