నిజామాబాద్ లీగల్ : ఒక మైనర్ బాలికపై లైంగిక దాడి చేయడంతో పాటు నగదు దోపిడీ చేసిన ఉప్పు రమేశ్, సయ్యద్ అస్రఫ్ అలీలకు ఒక్కొక్కరికీ ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ నిజామాబాద్ రెండవ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు (ప్రత్యేక పోక్సో కోర్టు) న్యాయమూర్తి పంచాక్షరి గురువారం తీర్పు వెలువరించారు. 2019 ఏప్రిల్ 20న అలీసాగర్ గార్డెన్ పరిసరాల్లో మైనర్ బాలిక తన స్నేహితులతో కలిసి వెళ్తుండగా ఇద్దరు ముద్దాయిలు జాన్కంపేట్ గ్రామానికి చెందిన ఉప్పు రమేశ్, సయ్యద్ అస్రఫ్ అలీ పోలీసులమని చెప్పి వారిని బెదిరించారు. ఆమె స్నేహితుల దగ్గర నగదు, సెల్ఫోన్ దోపిడీ చేశారు. సదరు బాలిక శరీరంపై చేతులతో తాకి లైంగిక దాడి చేశారని తెలిపారు.
నేర విచారణలో భాగంగా మొత్తం ఆరుగురు సాక్షుల సాక్ష్యాలు నమోదు చేసిన కోర్టు సాక్షుల వాంగ్మూలాలు, ఐదు ధృవపత్రాలు, మూడు వస్తు రూప సాక్ష్యాలు పరిశీలించి ముద్దాయిపై నేరారోపణలు రుజువైనట్లు ప్రకటించింది. ఇండియన్ పినల్ కోడ్ సెక్షన్ 419 ప్రకారం (ప్రతి రూపణము ద్వారా దగా చేయుట) ప్రకారం మూడేళ్ల కఠిన జైలు, వెయ్యి రూపాయల జరిమానా, సెక్షన్ 392 (దోపిడీ) ప్రకారం ఐదేళ్ల కఠిన జైలు వెయ్యి రూపాయల జరిమానా ఇద్దరికి విధిస్తూ తీర్పు చెప్పారు. రెండవ ముద్దాయి సయ్యద్ అస్రఫ్ అలీకి పోక్సో చట్టం సెక్షన్ 8 (లైంగిక దాడి) ప్రకారం ఐదేళ్ల కఠిన జైలు, ఐదు వేల రూపాయల జరిమానాను విధిస్తున్నట్లు జడ్జి పంచాక్షరి తమ తీర్పులో వెల్లడించారు. ముద్దాయిలిద్దరు జరిమానా చెల్లించకుంటే అదనంగా మూడు నెలల శిక్ష అనుభవించాలని పేర్కొన్నారు.