లక్నో: రైలు కంపార్ట్మెంట్లోని కిటికీ వద్ద కూర్చొన్న వ్యక్తి మెడలోకి ఇనుప రాడ్ దిగింది. దీంతో అతడు కూర్చొన స్థితిలోనే మరణించాడు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం ఢిల్లీ నుంచి కాన్పూర్ వెళ్తున్న నీలనాచల్ ఎక్స్ప్రెస్లో హరికేష్ కుమార్ దూబే అనే వ్యక్తి ప్రయాణించాడు. ఒక కంపార్ట్మెంట్లోని విండో సీటు వద్ద అతడు కూర్చొన్నాడు. ఉదయం 8.45 గంటలకు ఆ రైలు ప్రయాగ్రాజ్ డివిజన్లోని దన్వర్, సోమన రైల్వే స్టేషన్ల మధ్య ప్రయాణించింది.
ఇంతలో ట్రాక్ పనికి వినియోగించే ఒక ఇనుప రాడ్, రైలు కిటికీ అద్దాన్ని పగులగొట్టి లోనికి చొచ్చుకొచ్చింది. విండో సీటు వద్ద కూర్చొన్న హరికేష్ మెడలోకి అది దిగింది. రక్తం ధారగా కారడంతో కూర్చొన్న పొజిషన్లోనే అతడు చనిపోయాడు. ఇది చూసి ఆ కంపార్ట్మెంట్లోని ప్రయాణికులు భయంతో షాకయ్యారు.
ఈ సంఘటన అనంతరం ఆ ఎక్స్ప్రెస్ రైలు అలీగఢ్ స్టేషన్లో ఆగింది. దీంతో రైల్వే పోలీసులు హరికేష్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనూహ్యంగా జరిగిన ఈ ప్రమాద సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.