మియాపూర్ : మియాపూర్ ఠాణా పరిధిలో 13 నెలల పసికందు మృతి మిస్టరీగా మారింది. తొలుత పాప కిడ్నాప్ అయిందని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయటంతో మియాపూర్ పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేశారు. కొద్ది గంటల వ్యవధిలోనే సదరు చిన్నారి మృతదేహం లభ్యం కావటంతో అనుమానాస్పద మృతిగా కేసును మార్చారు. సంఘటన వివరాలిలా ఉన్నాయి. మియాపూర్ ఠాణా పరిధిలోని ఓంకార్ నగర్లోని గుడిసెలలో రంగస్వామి సుమలతలు గడచిన 20 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నారు. వారికి 13 నెలల సోనీ అనే కూతురు ఉన్నది.
ఆదివారం సాయంత్రం 5.30 గంటల సమయంలో సోనీ తోటి పిల్లలతో ఇంటి సమీపంలోనే ఆడుకుంటూ అదృశ్యమైంది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు చిన్నారి ఆచూకీ కోసం ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. దీనిపై మియాపూర్ ఠాణాలో ఫిర్యాదు చేయగా….పోలీసులు కేసు నమోదు చేశారు. తొలుత 13 సంవత్సరాల బాలుడు చిన్నారిని అపహరించారని స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టడంతో పాటు సీసీ కెమెరాలను పరిశీలించారు. కాగా సోమవారం ఉదయం 5.30 గంటల ప్రాంతంలో చిన్నారి మృతదేహం గుడిసెల వద్దే లభ్యమైనట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీకి తరలించారు.
అయితే చిన్నారి ఒంటిపై ఎటువంటి గాయాలైన ఆనవాళ్లు లేవని, కడుపు, ముక్కు, చెవుల నిండ నీరు నిండి ఉన్నట్లు పోస్టు మార్టం నివేదికలో ఉన్నట్లు సమాచారం. అయితే చిన్నారి ఆడుకుంటూ వెళ్లి నీటి గుంతలోలేదా తొట్టిలో పడి ఉంటే మృతదేహం అక్కడే ఉండాల్సి ఉండగా…అందుకు భిన్నంగా గుడిసె ముందు ప్రత్యక్షమైంది. దీంతో ఎవరైనా హత్య చేసి చిన్నారి మృతదేహాన్ని ఇంటి ముందు పడేసి వెళ్లారా ? అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. పోస్టు మార్టం పూర్తి నివేదిక…పోలీసుల విచారణ అనంతరం అసలు విషయాలు బహిర్గతం కానున్నాయి