చెన్నై : ప్రతి రోజు ఏదో ఒక చోట దళితుల పట్ల దాడులు జరుగుతూనే ఉన్నాయి. దళిత సమాజాన్ని ఏదో ఒక రకంగా హింసిస్తూనే ఉన్నారు. వేధింపులకు గురవుతూనే ఉన్నారు. చివరకు తినే తిండి వద్ద, తాగే నీటి వద్ద కూడా దళితులు వివక్షకు గురవుతున్నారు. కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు.. దళితులకు సరఫరా చేసే నీటి ట్యాంకులో అధిక మొత్తంలో మానవ మలాన్ని పడేసి పైశాచిక ఆనందం పొందారు. ఈ దారుణ ఘటన తమిళనాడులోని పుడుకొట్టయి జిల్లాలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. పుడుకొట్టయి జిల్లాలోని ఇరయూర్ గ్రామంలో 100 మంది దళితులు ఉన్నారు. అయితే చాలా మంది పిల్లలు ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో చిన్నారులను ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు చికిత్స అందించారు. అయినప్పటికీ పిల్లలకు వాంతులు, విరేచనాలు తగ్గడం లేదు. కలుషితమైన నీటిని తాగడం వల్లే ఇలా జరిగి ఉండొచ్చని, ఒకసారి ట్యాంక్ను పరిశీలించాలని గ్రామస్తులకు వైద్యులు సూచించారు.
దీంతో గ్రామస్తుల్లో ఒకరు.. 10 వేల లీటర్ల కెపాసిటీ ఉన్న వాటర్ ట్యాంక్ను పరిశీలించాడు. ఆ ట్యాంక్లో అధిక మొత్తంలో మానవ మలం ఉన్నట్లు గుర్తించారు. షాకైన దళితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఇక జిల్లా కలెక్టర్ కవిత రాము, జిల్లా పోలీసు చీఫ్ వందిత పాండే ఇరయూర్ గ్రామానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
తమకు జరుగుతున్న అవమానాలపై కలెక్టర్, పోలీసు ఉన్నతాధికారులకు దళితులు ఫిర్యాదు చేశారు. ఇప్పటికీ గ్రామంలో తమ పట్ల వివక్ష కొనసాగుతుందని తెలిపారు. చాయ్ దుకాణంలో రెండు గ్లాసుల పద్ధతి కొనసాగుతోందని వాపోయారు. గుడిలోకి అనుమతి లేదని పేర్కొన్నారు. ఈ క్రమంలో అధికారులు, పోలీసులు కలిసి అగ్ర కులస్తులతో సమావేశం ఏర్పాటు చేసి, దళితులను గుడిలోకి వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. అయితే ట్యాంక్లో పెద్ద మొత్తంలో మానవ మలాన్ని పడేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. ఈ ఘటనకు పాల్పడిన వారు ఎవరైనా సరే వదిలిపెట్టమని హెచ్చరించారు.