ముంబై: కాలేజ్ స్నేహితురాలిని పెళ్లి చేసుకోవాలని ఒక వ్యక్తి తపించాడు. నిరాకరించడంతో ఆమెను వేధించాడు. చివరకు ఆమె భర్తను హత్య చేశాడు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. శాంతాక్రూజ్లోని గోలీబార్ నగర్లో నివాసం ఉంటున్న అకీల్ సయ్యద్, షాజహాన్ అనే మహిళ కలిసి ఒకే కాలేజీలో చదువుకున్నారు. తనను పెళ్లి చేసుకోవాలని ఆమెను వేధించాడు. ఒకవేళ వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఆమె భర్తను హత్య చేస్తానని కూడా బెదిరించాడు. అయితే అతడి మాటలు, బెదిరింపులను షాజహాన్ పట్టించుకోలేదు. అనంతరం థానేలో రోల్డ్ గోల్డ్ ఆభరణాల వ్యాపారం చేసే పర్వేజ్ బషీర్ షేక్తో ఆమెకు వివాహం జరిగింది.
కాగా, సయ్యద్కు కూడా పెళ్లి అయ్యింది. అయినప్పటికీ తనను పెళ్లి చేసుకోవాలని షాజహాన్ను వేధించసాగడు. దీంతో ఆమె ఈ విషయాన్ని భర్త పర్వేజ్కు చెప్పింది. దీనిపై వారిద్దరి మధ్య ఒకసారి గొడవ కూడా జరిగింది. అయినప్పటికీ తన భార్యను సయ్యద్ వేధిస్తుండటంతో మరోసారి మాట్లాడేందుకు శుక్రవారం సాయంత్రం ఖార్ సబ్వే వద్ద వారిద్దరూ కలుసుకున్నారు. ఈ సందర్భంగా మాటామాటా పెరిగి పోట్లాటకు దారి తీసింది. ఈ నేపథ్యంలో పర్వేజ్ను కత్తితో సయ్యద్ పలుమార్లు పొడిచి పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన పర్వేజ్ను స్థానికులు ఆసుపత్రికి తీసుకెళ్లగా అతడు అక్కడ చనిపోయాడు.
మరోవైపు మృతుడి భార్య షాజహాన్ ఫిర్యాదుతో వకోలా పోలీస్ స్టేషన్ పోలీసులు సయ్యద్పై హత్య కేసు నమోదు చేశారు. అతడు బంద్రా ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించి శనివారం అరెస్ట్ చేశారు.