జైపూర్ : తాగుడుకు బానిసై నిత్యం వేధింపులకు గురిచేస్తున్న భర్తను గొంతు కోసి హతమార్చిన భార్య ఉదంతం రాజస్దాన్లోని భరత్పూర్లోని నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. రెండు రోజుల కిందట జరిగిన ఈ ఘటనలో నేరాన్ని అంగీకరించడంతో మహిళను గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మద్యానికి బానిసైన జితేంద్ర (30) రోజూ తాగి వచ్చి భార్య దీప (28)ను వేధిస్తుండే వాడు. జితేంద్ర మద్యం అలవాటుతో విసిగిన దీప నిత్యం అతడితో గొడవ పడేది. భర్త తీరుతో విసిగిపోయిన దీప మంగళవారం అతడికి కూల్డ్రింక్లో మత్తుమందు కలిపి ఇచ్చింది. డ్రింక్ తాగిన తర్వాత జితేంద్ర స్ప్రహ కోల్పోవడంతో గొంతు కోసి హత్య చేసింది.
మృతదేహం లభించినప్పటి నుంచి దీప ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా తాగుడుకు బానిసైన భర్తను తానే అంతమొందించానని నేరాన్ని అంగీకరించింది. కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి దర్యాప్తు ముమ్మరం చేశారు.