ఢిల్లీ : మహిళలు, చిన్నారులపై లైంగిక వేధింపుల ఘటనలకు బ్రేక్ పడటం లేదు. ఢిల్లీ మెట్రో స్టేషన్లో మహిళను లైంగిక వేధింపులకు గురిచేసిన ఘటన కలకలం రేపింది. జోర్ బాగ్ మెట్రో స్టేషన్లో జూన్ 2న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియా వేదికలపై వీడియో వైరల్ కావడంతో ఈ ఉదంతం బయటపడింది. ఆపై మహిళ కూడా ట్విట్టర్లో తనకు ఎదురైన అనుభవాన్ని వరుస ట్వీట్లలో వెల్లడించింది.
మహిళ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జూన్ 2న మహిళ ఢిల్లీ మెట్రో రైలు యల్లో లైన్లో ప్రయాణిస్తుండగా ఓ వ్యక్తి ఆమెను అడ్రస్ అడిగాడు. అడ్రస్ వివరాలు తెలిపిన అనంతరం ఆమె జోర్ బాగ్ మెట్రో స్టేషన్లో దిగి క్యాబ్ బుక్ చేసుకునేందుకు అక్కడున్న కుర్చీలో కూర్చుంది. ఈలోగా నిందితుడు మరోసారి ఆమె వద్దకు వచ్చి తనకు కావాల్సిన అడ్రస్ గురించి అడిగాడు.
మరోసారి ఆమె ఆయా వివరాలు చెబుతుండగా నిందితుడు తన ప్రైవేట్ భాగాలు చూపుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. నిందితుడి చర్యలతో భయపడిన మహిళ అక్కడి నుంచి పరుగుతీసిన దృశ్యాలు వీడియోలో కనిపించాయి. ఆపై నిందితుడు కూడా ఘటనా స్ధలం నుంచి పరారయ్యాడు. మహిళ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.