జైపూర్ : రాజస్ధాన్లో దారుణం వెలుగుచూసింది. జైపూర్లో బుధవారం రాత్రి 35 ఏండ్ల మహిళలపై రైల్వే ట్రాకుల సమీపంలో ఐదుగురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. నిందితులను అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు ముమ్మరం చేశామని డీఎస్పీ కిషన్ సింగ్ తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాధితురాలు ఢిల్లీ వెళ్లే రైలు కోసం భర్తతో కలిసి ఉండగా ఈ ఘటన జరిగింది. తాగిన మైకంలో ఉన్న భర్త ఆకలిగా ఉందనడంతో సమీపంలోని రెస్టారెంట్లో ఆహారం తీసుకువచ్చేందుకు మహిళ వెళ్లింది. రెస్టారెంట్ నుంచి తిరిగివస్తుండగా ఐదుగురు వ్యక్తులు అడ్డగించి తాము రైల్వే స్టేషన్ వద్ద విడిచిపెడతామని చెప్పగా ఆమె నిరాకరించింది.
దీంతో నిందితుల్లో ఒకరు ఆమెను బలవంతంగా రైల్వే ట్రాకుల వద్దకు తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆపై ఐదుగురు నిందితులు ఆమెపై సామూహిక లైంగిక దాడికి తెగబడ్డారు. అనంతరం ఘటనా స్ధలం నుంచి నిందితులు పరారయ్యారు. రైల్వే ట్రాకుల వద్ద రాళ్లపై పడటంతో బాధితురాలికి గాయాలయ్యాయి. బాధిత మహిళ భర్తతో కలిసి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.