చెన్నై : పొరుగింటి వ్యక్తి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడటంతో గర్భం దాల్చిన బాలిక (16) తీవ్ర మనస్ధాపంతో ఆత్మహత్య చేసుకుని తనువు చాలించిన ఘటన తమిళనాడులోని తిరువణమలై జిల్లాలో వెలుగుచూసింది. ఈ కేసుకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలి పొరుగున ఉండే వ్యక్తితో పాటు బాలిక చదివిన స్కూల్ ప్రిన్సిపల్, హాస్టల్ వార్డెన్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత ఏడాది కొవిడ్-19 నియంత్రణలు అమల్లో ఉండగా తాను ఇంట్లో ఉన్న సమయంలో పక్కింటి వ్యక్తి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
2021 డిసెంబర్లో బాలిక స్కూల్కు రాగానే కండ్లు తిరిగి పడిపోయింది. దీంతో స్కూల్ సిబ్బంది ఆస్పత్రికి తీసుకువెళ్లగా బాలిక గర్భవతని వెల్లడైంది. స్కూల్ ప్రిన్సిపల్, వార్డెన్ బాలికకు ఆరోగ్యం బాగాలేదని ఇంటికి తీసుకెళ్లాలని తల్లితండ్రులకు చెప్పారు. బాలిక గర్భం దాల్చిన విషయాన్ని వారు వెల్లడించలేదు. తల్లితండ్రులు ఆమెను ఇంటికి తీసుకువెళ్లిన తర్వాత జనవరి 7న ఆత్మహత్యా యత్నం చేసింది.
ఆమెను తిరువణమలై ప్రభుత్వ ఆస్పత్రికి తల్లితండ్రులు తీసుకువెళ్లగా బాలిక గర్భం దాల్చిందని వైద్యులు తెలిపారు. బాలిక స్పృహలోకి రాగానే పొరుగున ఉండే వ్యక్తి తనపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని, గర్భం దాల్చిన విషయం తెలియగానే ఆత్మహత్యాయత్నం చేశానని తెలిపింది. బాలిక చికిత్స పొందుతూ మరణించిందని పోలీసులు వెల్లడించారు. బాలిక స్టేట్మెంట్ ఆధారంగా నిందితుడితో పాటు బాలిక గర్భవతి అని తెలిసినా వెల్లడించని స్కూల్ ప్రిన్సిపల్, వార్డెన్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.