ముజఫర్నగర్ : యూపీలో బాలికలు, మహిళలు, చిన్నారులపై లైంగిక దాడుల ఘటనలు కొనసాగుతున్నాయి. తాజాగా రాష్ట్రంలోని ముజఫర్నగర్లో దారుణం వెలుగుచూసింది. 71 ఏండ్ల వయసున్న స్కూల్ ప్రిన్సిపల్ మూడో తరగతి చదువుతున్న బాలిక (9)పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో స్కూల్ ప్రిన్సిపల్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
నేరాన్ని దాచినందుకు అదే స్కూల్కు చెందిన టీచర్ను కూడా అరెస్ట్ చేశారు. బుధవారం బాధిత బాలికకు రక్తస్రావం కావడంతో ఇంటికి తిరిగివెళ్లి కుటుంబ సభ్యులకు విషయం తెలపడంతో ఈ దారుణం వెలుగుచూసింది. బాలిక వైద్య పరీక్షల నివేదిక కోసం వేచిచూస్తున్నామని పోలీసులు తెలిపారు. ప్రిన్సిపల్పై పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
తమ కుమార్తెను ఏదో సాకుతో ప్రిన్సిపల్ రూంకు పిలిచారని, ఆపై బాలిక దుస్తులు తొలగించిన నిందితుడు లైంగిక దాడికి పాల్పడ్డాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాలిక తండ్రి ఆరోపించారు. ప్రిన్సిపల్, టీచర్ను అరెస్ట్ చేసి మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచి ఆపై జైలుకు తరలించామని నాగర్ కొత్వలి ఎస్హెచ్ఓ ఆనంద్ దేవ్ మిశ్రా తెలిపారు.