లక్నో : ఆలయ ప్రాంగణంలో మాంసాహారంతో పాటు మద్యం సేవించాడనే ఆరోపణలపై పూజారిని హత్య చేసిన ఘటన యూపీలోని ఫిలిభిత్లో వెలుగుచూసింది. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. నవదియ జితినియ గ్రామంలోని మహాదేవ్ స్ధాన్ ఆలయ పూజారి బాబా రిషిగిరి అలియాస్ మదన్లాల్ కనిపించడం లేదంటూ జులై 7న ఓ వ్యక్తి ఫిర్యాదు ఇవ్వడంతో ఈ ఘటన బయటకువచ్చింది. పూజారి కోసం పోలీసులు గాలించగా రసుల గ్రామంలోని కాలవ వద్ద ఆయన మృతదేహాన్ని గుర్తించారు.
పూజారి భార్య కళావతి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించిన పోలీసులు మదన్లాల్తో చివరిసారిగా నన్హే అలియాస్ లాలా రాం కనిపించినట్టు గుర్తించారు. పోలీసుల విచారణలో మరో ఇద్దరు నిందితులు ధన్రాజ్, ముఖియ సహకారంతో తాము ఈ హత్య చేశామని నన్హే నేరాన్ని అంగీకరించాడు. ఆలయ ప్రాంగణంలోనే పూజారి బాబా రిషిగిరి మద్యం సేవించి మాంసాహారం తీసుకుంటాడని ఈ విషయమై తాము పలుమార్లు అతడికి చెప్పినా మార్పు రాలేదని నన్హే తెలిపాడు.
ఆ రోజు బాబా కోసం తాము మాంసం, మద్యం తెప్పించి ఆయనను పిలిపించామని, ఆపై తమ మధ్య వాగ్వాదం జరగడంతో బాబాను కర్రలతో తీవ్రంగా కొట్టామని చెప్పాడు. ఆపై బాబా ప్రాణాలు కాపాడుకునేందుకు పొలాల్లోకి పరిగెత్తాడని, తాము వెంబడించగా రసూల గ్రామ సమీపంలోని కాలువ వద్ద రక్తపు మడుగులో పడి ఉన్నాడని తెలిపాడు. బాబా విగతజీవిగా పడిఉండటంతో భయపడిన తాము కర్రలను అక్కడే ఉన్న చెట్ల పొదల్లో విసిరేసి పారిపోయామని చెప్పాడు. నిందితులు ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి బాబాను కొట్టేందుకు ఉపయోగించిన కర్రలను స్వాధీనం చేసుకున్నారు.