పుణే : మహారాష్ట్రలోని పుణే జిల్లాలో ఫ్రెండ్షిప్ క్లబ్ ద్వారా హై ప్రొఫైల్ మహిళలతో డేటింగ్ అవకాశం కల్పిస్తామని 76 ఏండ్ల వృద్ధుడిని కేటుగాళ్లు రూ 60 లక్షలకు మోసం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిని పుణే సైబర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో మరో నిందితురాలైన 28 ఏండ్ల మహిళను సైబర్ పోలీసులు ఈనెల 11న అరెస్ట్ చేశారు. బాధితుడి నుంచి నగదును మళ్లించేందుకు మహిళ ఖాతాను వాడుకున్నారు. సీనియర్ సిటిజెన్ పిర్యాదు ఆధారంగా మహిళను అదుపులోకి తీసుకున్నారు.
మే 2021లో ఫ్రెండ్షిప్ క్లబ్ పేరుతో ప్రకటన ఇచ్చిన క్రమంలో బాధితుడు నిందితుల వలలో చిక్కుకున్నాడు. ఆపై ప్రకటనలో ఇచ్చిన ఫోన్ నెంబర్కు బాధితుడు ఫోన్ చేయగా హై ప్రొఫైల్ మహిళలతో డేటింగ్ చేయడంతో పాటు డబ్బు కూడా సంపాదించవచ్చని వృద్ధుడిని నిందితులు ప్రలోభానికి గురిచేశారు. మెంబర్షిప్ ఫీజు, సెక్యూరిటీ డిపాజిట్ల వంటి పేర్లతో మే 2021 నుంచి ఫిబ్రవరి 22 మధ్య రూ 60 లక్షల వరకూ బాధితుడి నుంచి రాబట్టారు. డబ్బు సమకూర్చినా మహిళలను పరిచయం చేయకపోవడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.
ఈ కేసులో మనోర్ (35) అనే నిందితుడిని అరెస్ట్ చేశామని ఇన్స్పెక్టర్ సంగీత మాలి వెల్లడించారు. కేసు దర్యాప్తు ముమ్మరం చేశామని తెలిపారు. ఇక పుణేలో జరిగిన మరో ఘటనలో ఆన్లైన్లో టీవీ క్యాబినెట్ను అమ్మేందుకు ప్రయత్నించిన వ్యక్తి నుంచి సైబర్ నేరగాళ్లు రూ 3 లక్షలకు టోకరా వేశారు. ఓ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయాలని మోసగాళ్లు కోరగా రెండు ఖాతాల నుంచి బాధితుడు రూ 3 లక్షలు మోసపోయాడు. దీంతో బాధితుడు పింప్రి చించ్వాద్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.