లక్నో : యూపీలోని గొండా జిల్లాలో ఆశారాం బాపు ఆశ్రమం లోపల పార్క్ చేసిన కారులో నుంచి శుక్రవారం మైనర్ బాలిక మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకోవడం కలకలం రేపింది. ఆశారాం బాపూ లైంగిక దాడి కేసులో దోషిగా నిర్ధారణై జైలు శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 5న ఇంటి నుంచి అదృశ్యమైన 14 ఏండ్ల బాలిక మృతదేహం బిమూర్ గ్రామంలోని ఆశారాం బాపూ సేవా కేంద్ర ఆశ్రమంలో పార్క్ చేసిన కారులో లభ్యమైందని పోలీసులు వెల్లడించారు.
కారు నుంచి దుర్వాసన వస్తుండటంతో శుక్రవారం ఉదయం ఈ ఘటన వెలుగుచూసింది. మృతదేహాన్ని కనుగొన్న ఆశ్రమ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం తరలించారు. పోస్ట్మార్టం నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు చేపడతామని డీఐజీ ఉపేంద్ర కుమార్ అగర్వాల్ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చాలా రోజుల నుంచి ఈ కారు ఆశ్రమం లోపల పార్క్ చేసి ఉంది.
ఇక ఏప్రిల్ 5న ఇంటి వెలుపల ఆడుకుంటుండగా బాలిక అదృశ్యమైంది. బాలికను యాచక వృత్తిలోకి దించేందుకు ముగ్గురు స్ధానికులు కిడ్నాప్ చేశారని ఆరోపిస్తూ బాధితురాలి తల్లి కొత్వాలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆశారాం బాపూ ఆశ్రమం బాధితురాలి ఇంటికి సమీపంలో ఉండటం గమనార్హం. ఇక ఆశారాం బాపూ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన అభియోగాలు రుజువు కావడంతో దోషిగా తేలి 2013 నుంచి జోధ్పూర్ సెంట్రల్ జైలులో ఉన్నారు.