చెన్నై : తన సోదరుడిని అంతమొందించిందనే అనుమానంతో స్నేహితుడితో కలిసి మహిళను హత్య చేసిన యువకుడి (19)ని పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడులోని తిరుపూర్ సమీపంలో కామరాజర్ నగర్లో ఈ ఘటన వెలుగుచూసింది. బాధితురాలు షహిన్ష (26) ఆదివారం తన ఇంట్లో విగతజీవిగా పడిఉండటం గుర్తించారు. మహిళ స్పృహ లేకుండా పడిఉండటం చూసిన ఆమె తల్లి కెలబక్కం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బయటపడింది.
నిందితుడు కార్తీక్ అతడి స్నేహితులు మహిళ గొంతును టవల్తో బిగించి ఊపిరాడకుండా చేసి ఉసురుతీశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం షహిన్షకు విజయ్తో వివాహం కాగా రెండేండ్ల కిందట అతడు మరణించాడు. విజయ్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆమె ఇరుగు పొరుగు వారితో చెప్పింది. అయితే తన సోదరుడిని వదిన హత్య చేసిందని కార్తీక్ అనుమానం పెంచుకున్నాడు.
సోదరుడి మరణానికి దారితీసిన కారణాలను తెలుసుకునేందుకు బాధితురాలికి దగ్గరయ్యాడు. సోదరుడి మృతి గురించి పదేపదే అడుగుతుండటంతో ఆమె కార్తీక్ను దూరం పెట్టింది. ఈ ఘటన గురించి మరోసారి ప్రస్తావిస్తే తన సోదరుడికి పట్టిన గతే పడుతుందని ఆమె కార్తీక్ను హెచ్చరించింది. దీంతో మహిళపై కోపం పెంచుకున్న కార్తీక్ ఆదివారం తన స్నేహితుడితో కలిసి ఆదివారం ఆమెను హత్య చేశాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదు ఆధారంగా కార్తీక్తో పాటు అతడి స్నేహితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.