న్యూఢిల్లీ : సోదరిని వేధిస్తున్న ఆకతాయిలను వారించిన యువకుడి (22)ని కత్తిపోట్లతో కడతేర్చిన ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పశ్చిమ ఢిల్లీలోని పంజాబి బాగ్ ప్రాంతంలో ఈ ఘటన వెలుగుచూసింది. ఈ ఘటనలో యువతి మరో సోదరుడు తీవ్రంగా గాయపడ్డాడు. మృతుడిని మనోజ్గా, క్షతగాత్రుడిని లక్ష్మీప్రసాద్గా గుర్తించారు.
యువకుడు కత్తిపోట్లకు గురయ్యాడని శుక్రవారం రాత్రి ఆచార్య బిక్షు ఆస్పత్రి నుంచి పోలీసులకు సమాచారం అందడంతో ఈ ఘటన బయటకువచ్చింది. మనోజ్ అశోక్ పార్క్ ప్రాంతంలో కుటుంబసభ్యులతో కలిసి నివసిస్తుండగా అతడి సోదరి భర్త మనోహర్తో కలిసి ఉంటోంది. మనోజ్ సోదరిని అదే భవనంలోని రెండవ అంతస్తులో ఉండే కొందరు యువకులు వేధిస్తున్నారు.
దీనిపై ఆమె సోదరుడు లక్ష్మీ ప్రసాద్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో నిందితుడు పదునైన ఆయుధంతో అతడి తలపై కొట్టాడు. ఈ ఘటన గురించి మనోజ్కు తెలియడంతో నిందితులను నిలదీశాడు. దీంతో నిందితులు కత్తితో మనోజ్పై దాడి చేశారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా నిందితులు మిధున్, టిల్జు, విజేంద్ర, గరీబన్, రాజ్కుమార్, రవీంద్రలను పోలీసులు అరెస్ట్ చేశారు.