చండీఘఢ్ : ఆస్తుల మీద వ్యామోహంతో కన్నతల్లితండ్రులనే కాల్చి చంపిన దుర్మార్గుడి ఉదంతం హర్యానాలో వెలుగుచూసింది. తన పేరుమీద హోటల్ను రిజిస్టర్ చేసేందుకు నిరాకరించిన తల్లితండ్రులను స్వయంగా కన్నకొడుకు కడతేర్చిన ఘటన జాఝర్ రోడ్ వార్డు నెంబర్ 18లో చోటుచేసుకుంది.
శనివారం తెల్లవారుజామున నాలుగు గంటలకు జంట హత్యల సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకున్నారు. మృతుడిని హోటల్ను నడిపే చంద్రభాన్ (58)గా గుర్తించారు. హోటల్ను తన పేరు మీద రిజిస్టర్ చేయాలని మృతుడి కుమారుడు తరుణ్ ఒత్తిడి చేస్తున్నాడు.
ఈ క్రమంలో తరుణ్ డిమాండ్ను నిరాకరించడంతో శనివారం తెల్లవారుజామున తల్లితండ్రులు నిద్రిస్తుండగా కాల్చిచంపాడు. బుల్లెట్ల శబ్ధం విన్న తరుణ్ భార్య కిందకు వచ్చి చూడగా అత్తామామలు రక్తపు మడుగులో పడిఉండటం కనిపించింది. ఘటనపై ఆమె పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ఉదంతం వెలుగుచూసింది. కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.