అహ్మదాబాద్ : గుజరాత్లో దారుణం వెలుగుచూసింది. కోడలిని బెదిరించి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన వ్యాపారి ఉదంతం వెల్లడైంది. ఈ ఏడాది ఫిబ్రవరి 14 ఏప్రిల్ 14 మధ్య నిందితుడు తనపై నాలుగు సార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం బయటపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాధితురాలికి 2002లో నిందితుడి కుమారుడితో వివాహం కాగా, వారికి 18 ఏండ్ల కుమారుడు ఉన్నాడు.
భార్యాభర్తల మధ్య కొన్నేండ్ల తర్వాత తరచూ ఘర్షణలు జరుగుతుండటంతో విసిగిన మహిళ కుమారుడితో కలిసి సూరత్లోని పుట్టింట్లో ఉంటోంది. ప్రతినెలా నిర్వహణ ఖర్చుల కింద రూ 6000 చెల్లించాలని నిందితుడి కుమారుడిని కోర్టు ఆదేశించింది. 2017లో బాధితురాలి తల్లి చనిపోవడంతో నిందితుడు తన కుటుంబ సభ్యులతో కలిసి సూరత్ వెళ్లాడు. ఈ క్రమంలో మహిళ ఆమె భర్త మధ్య రాజీ కుదరడంతో బాధితురాలు తిరిగి మెట్టినింటికి చేరింది.
అయితే తిరిగి భార్యభర్తల మధ్య గొడవలు మొదలవడంతో మహిళ బావ, ఆమె భార్య వేరుగా ఉంటున్నారు. ఆపై భార్యను దూరం పెట్టిన భర్త అన్న, వదినల వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో కోడలిపై కన్నేసిన నిందితుడు ఈ ఏడాది ఫిబ్రవరి 14న ట్యాంక్లో నీళ్లు లేవని చెప్పడంతో చూసేందుకు వచ్చిన కోడలిని వెనకనుంచి పట్టుకుని తన రూంలోకి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే ఆమె కుమారుడిని చంపేస్తానని బెదిరించాడు. భర్త దూరంగా ఉన్నాడనే లోటు లేకుండా చూస్తానని మనవడు ఇంట్లో లేని సమయంలో కోడలిపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.