పుణే : వృద్ధాప్యంలో తండ్రికి ఆసరాగా నిలవాల్సిన కొడుకు కిరాతకుడిగా మారాడు. 80 ఏండ్ల వయసులో మళ్లీ పెండ్లి చేసుకునేందుకు మ్యారేజ్ బ్యూరోలో పేరు నమోదు చేయించుకున్నాడనే కోపంతో కన్నతండ్రిని దారుణంగా హత్య చేశాడు. మహారాష్ట్రలోని పుణే సమీపంలో రాజ్గరునగర్లో ఈ దారుణం వెలుగుచూసింది. నేరానికి పాల్పడిన అనంతరం నిందితుడు శేఖర్ బోర్హదె (47) స్వయంగా పోలీస్ స్టేషన్కు వచ్చి లొంగిపోయాడు.
తన తండ్రి మళ్లీ పెండ్లి చేసుకోవాలని కోరుకుంటున్నట్టు తెలియగానే తాను పట్టరాని ఆవేశంతో ఊగిపోయానని నేరాన్ని అంగీకరిస్తూ నిందితుడు పేర్కొన్నాడు. కన్న తండ్రిని హత్య చేసిన శేఖర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాజ్గురునగర్ నందదీప్ హౌసింగ్ సొసైటీలో నివసించే శంకర్ రంభు బొర్హాదె (80) పెండ్లి చేసుకునేందుకు వధువును చూడాలని కోరుతూ ఓ మ్యారేజ్ బ్యూరోలో ఫీజు చెల్లించి పేరు నమోదు చేయించుకున్నాడు.
ఈ విషయం తెలిసిన ఆయన కుమారుడు శేఖర్ ఆగ్రహంతో ఊగిపోతూ తండ్రిపై కత్తితో దాడి చేశాడు. కత్తితో తండ్రి మెడ కోసిన శేఖర్ ఆపై మసాలా నూరే రాయితో తండ్రి తలపై బలంగా కొట్టాడు. తండ్రిని దారుణంగా హత్య చేసి నేరుగా స్టేషన్కు వచ్చి పోలీసులకు లొంగిపోయాడు. పోలీస్ ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్ గౌరవ్ కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు.