చండీఘఢ్ : పట్టపగలు స్టేడియంలో బాలికపై లైంగిక దాడి యత్నానికి పాల్పడిన ముగ్గురు వ్యక్తులు ప్రతిఘటించిన బాలికను పైకప్పు నుంచి తోసివేసిన ఘటన పంజాబ్లోని మోగా గొదెవాలా స్టేడియంలో వెలుగుచూసింది. ఆగస్ట్ 17న జరిగిన ఈ ఘటనలో బాలికకు గాయాలయ్యాయి.
ముగ్గురు నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. బాలిక తండ్రి ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశామని పోలీసులు తెలిపారు. బాలిక స్నేహితుడు ఫోన్ చేసి ఆమెను స్టేడియానికి పిలిపించాడని అక్కడ మరో ఇద్దరు స్నేహితులతో కలిసి బాలికతో వాగ్వాదానికి దిగాడని పోలీసులు చెప్పారు.
ఆపై ముగ్గురు వ్యక్తులు బాలికపై అత్యాచార యత్నం చేయగా ప్రతిఘటించడంతో పైకప్పు నుంచి ఆమెను కిందకు నెట్టివేశారని తెలిపారు. కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు ముమ్మరం చేశామని పోలీసులు వెల్లడించారు.