లక్నో : యూపీలో మహిళలు, యువతులు, చిన్నారులపై లైంగిక వేధింపులకు బ్రేక్ పడటం లేదు. హోటల్లో పనిచేస్తున్న యువతి (21)పై కదులుతున్న కారులో లైంగిక వేధింపులకు గురిచేయడంతో ఎస్యూవీ నుంచి దూకిన యువతికి గాయాలైన ఘటన లక్నోలోని జనేశ్వర్ మిశ్రా పార్క్ వద్ద జరిగింది. సహచరుడే ఈ దారుణానికి ఒడిగట్టడంతో తనను తాను కాపాడుకునేందుకు యువతి కారు నుంచి బయటకు దూకడంతో అటుగా వెళుతున్న వారు పోలీసులకు సమాచారం అందించారు.
ఈ ఘటనలో గాయాలైన యువతిని చికిత్స నిమిత్తం రాం మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు. కోలుకున్న అనంతరం యువతి స్టేట్మెంట్ను పోలీసులు రికార్డు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హోటల్లో పనిచేసే యువతితో పరిచయం పెంచుకున్న నిందితుడు తన మేనకోడలు కూడా హోటల్ మేనేజ్మెంట్ చేసేందుకు ఆసక్తి చూపుతోందని ఆమెకు సాయం చేయాలని కోరాడు.
యువతి ఇంటి నుంచి హోటల్కు వెళుతుండగా తాను కారులో డ్రాప్ చేస్తానని లిఫ్ట్ ఆఫర్ చేశాడు. కొద్ది దూరం వెళ్లిన తర్వాత యువతితో అసభ్యంగా ప్రవర్తించడంతో షాక్కు గురైన బాధితురాలు ఎస్యూవీ నుంచి కిందకు దూకింది. ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు రెండు గంటల్లోనే నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడు వాడిన ఎస్యూవీని సీజ్ చేశారు.