బెంగళూర్ : కర్ణాటక రాజధాని బెంగళూర్లో 16 ఏండ్ల బాలికపై ఆరు రోజుల పాటు నలుగురు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడిన ఘటన కలకం రేపింది. ఈ ఘటనకు సంబంధించి నేరానికి సహకరించిన ఇద్దరు మహిళలు సహా ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దారుణ ఘటనపై బాలిక తల్లి హెచ్ఎస్ఆర్ లేఅవుట్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో నిందితులు రాజేశ్వరి, కేశవమూర్తి, కళావతి, రఫీక్, శరత్, సత్యరాజులను అరెస్ట్ చేశారు. వీరిపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాధితురాలి ఇంటి పక్కనే నివసించే రాజేశ్వరి, కళావతి ఇండ్లకు టైలరింగ్ క్లాసుల కోసం బాలిక వెళుతోంది. ఓరోజు బాలిక ఇంటి వద్ద ఒంటరిగా ఉండగా రాజేశ్వరి వచ్చి ఆమెను తీసుకువెళ్లింది. బాలికకు ఫ్రూట్ జ్యూస్లో మత్తుమందు కలిపి ఇచ్చింది. బాలిక స్ప్రహ కోల్పోగానే ఆమెపై ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలుంటాయని బాలికను రాజేశ్వరి బెదిరించింది.
రాజేశ్వరి బాలికను కళావతి ఇంటికి తీసుకువెళ్లగా అక్కడ మరికొందరు పలు రోజులు లైంగిక దాడికి పాల్పడ్డారు. బాలిక ఆరోగ్యం దెబ్బతిన్నా కనికరించని మహిళలు రోజూ తమ ఇంటికి పిలిపించి దారుణానికి పాల్పడేవారు. బాలిక ఆరోగ్యం పాడవుతుండటం గమనించిన తల్లి నిలదీయగా జరుగుతున్న దారుణాన్ని బాధితురాలు తెలిపింది.