కోల్కతా : జిరాక్స్ కోసం బయటకు వెళ్లిన బాలిక తిరిగివస్తుండగా ఆమె ఇంటి సమీపంలోనే కిడ్నాప్ చేసేందుకు ముగ్గురు టీనేజర్లు, ఓ యువకుడు (25) విఫలయత్నం చేసిన ఘటన రాజర్హాట్లోని సిఖాపూర్లో కలకలం రేపింది. ఆదివారం బాలిక ఇంటి వద్దే ఈ ఘటన చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇద్దరు బాలికలు స్కూల్ నోట్స్ జిరాక్స్ తీసుకుని ఇంటికి వస్తుండగా జనసమ్మర్ధం లేని రోడ్డుపై నలుగురు యువకులు వారిని అడ్డగించి వేధించారు. ఓ బాలిక అభ్యంతరం వ్యక్తం చేయగా కారు నుంచి బయటకు దిగిన యువకులు బాలికను కారు లోపలికి లాగేందుకు ప్రయత్నించారు.
బాలికలు భయంతో కేకలు వేయగా సమీపంలోని పొలంలో పనిచేసుకుంటున్న కూలీలు అక్కడికి చేరుకోగానే నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. కారు రిజిస్ట్రేషన్ నెంబర్ను గుర్తుంచుకున్న బాలిక మరుసటి రోజు పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులు అరూప్ మండల్ (25), సఫీయుద్దీన్ మొల్లా (18), సలాలుద్దీన్ మొల్లా (18), మసుదర్ ఇస్లాం (18)ను అరెస్ట్ చేశారు. నిందితులపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితులను మంగళవారం బరాసత్ కోర్టులో హాజరు పరచగా పోలీస్ కస్టడీకి తరలించారు.