చెన్నై : తమిళనాడులోని తెనకి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన యువకుడితో తన కుమార్తె (20) సన్నిహితంగా మెలుగుతుండటంతో ఆగ్రహానికి లోనైన వ్యక్తి కొడవలితో కన్నకూతురిపై దాడికి తెగబడటం కలకలం రేపింది. పవూరచత్రం సమీపంలోని అరియంకవు గ్రామంలో సోమవారం ఈ దారుణ ఘటన వెలుగుచూసింది.
దాడి అనంతరం బాధితురాలు సుధను తిరునల్వేలి బోధనాసుపత్రికి తరలించగా ఆమె పరిస్ధితి విషమంగా ఉందని సమాచారం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బీడీలు చుట్టే పనిలో కుదిరిన సుధ డిగ్రీ చదివిందని, అదే గ్రామానికి చెందిన యువకుడితో ప్రేమలో పడి అతడిని పెండ్లి చేసుకోవాలని కోరుకుంది. ఇదే విషయం తండ్రికి చెప్పగా వారి సంబంధానికి విముఖత వ్యక్తం చేశాడు.
యువకుడితో దూరంగా ఉండాలని కూతురిని కోరాడు. దీంతో దిక్కుతోచని సుధ పోలీసులను ఆశ్రయించింది. గ్రామానికి చెందిన యువకుడితో కూతురు సన్నిహితంగా మెలగడం ఇష్టంలేని తండ్రి వేల్స్వామి కొడవలితో కూతురిపై దాడికి తెగబడ్డాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.