జైపూర్ : రాజస్ధాన్లో దారుణం జరిగింది. ప్రైవేట్ కంపెనీలో పనిచేసే మహిళ (32)కు మత్తుమందు ఇచ్చిన సహోద్యోగులు ఆమెపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. నిందితుడు నేరాన్ని కెమెరాలో రికార్డు చేసి ఆపై వీడియోను బహిర్గతం చేస్తానని బెదిరించి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలు ఆరోపించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..జైపూర్లోని చోము ప్రాంతానికి చెందిన మహిళ ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తోంది.
భర్త నుంచి వేరుగా ఉంటున్న మహిళ తన 8 ఏండ్ల కుమారుడితో విడిగా నివసిస్తోంది. గత ఏడాది అక్టోబర్ 2న ఆమె సహోద్యోగి పికు సొక్రియ ఆమెను డిన్నర్ చేద్దామని బైపాస్ రోడ్డులోని ఓ హోటల్కు పిలిచాడు. అక్కడకు వెళ్లగానే మహిళకు మత్తు మందు కలిపిన టీ ఇచ్చాడు. టీ తాగిన వెంటనే ఆమె స్పృహ కోల్పోగా నిందితుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ సమయంలో అక్కడికి చేరుకున్న నిందితుడి స్నేహితుడు పంకజ్ నాగర్ కూడా ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
లైంగిక దాడి ఘటనను నిందితుడు వీడియో తీసి దాన్ని వైరల్ చేస్తానని బెదిరిస్తూ ఆ తర్వాత పలుమార్లు మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. నిందితుడి ఆగడాలతో విసిగిన మహిళ ధైర్యం కూడదీసుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.