వెంగళరావునగర్ : దేశంలోకి అక్రమంగా చొరబడడమే కాకుండా వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఓ బంగ్లాదేశ్ ముఠాకు చెందిన ఏడుగురిని ఎస్.ఆర్.నగర్ పోలీసులు అరెస్టు చేశారు. ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. బంగ్లాదేశ్కు చెందిన ఖసుర్దాస్ సూర్మొహ్మద్ కొలిబా, నహీదా ఖుసుర్దాసు భార్యాభర్తలు.
వీరు 25 సంవత్సరాల క్రితం బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా దేశంలోకి ప్రవేశించారు. ముంబాయిలో ఉంటూ మహారాష్ట్ర నుంచి ఆధార్ కార్డు పొందారు. అనంతరం నగరానికి చేరుకుని బోరబండలోని విజేత థియేటర్ సమీపంలో ఇంటిని అద్దెకు తీసుకుని నివసిస్తున్నారు. కాగా కొలిబా సోదురుడైన ముషరఫ్ సర్దార్ ఇటీవలే పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ద్వారా అక్రమంగా దేశంలోకి ప్రవేశించి నకిలీ ఆధార్ కార్డు పొందాడు.
బోరబండలో ఉండే తన అన్నా, వదినల వద్దకు చేరుకుని తన అన్నతో కలిసి వ్యభిచార కార్యకలాపాలకు తెరతీశాడు. ముంబాయిలో స్థిరపడిన బంగ్లాదేశ్కు చెందిన షాబుద్దీన్,మిలన్ అనే ఇద్దరు వ్యభిచార కేంద్రం నిర్వాహకుల సహకారంతో దేశంలోకి పశ్చిమ బెంగాల్ గుండా ముగ్గురు యువతులను అతియార్ మొండల్ అనే వ్యక్తి హైదరాబాద్కు పంపారు. నకిలీ ఆధార్ కార్డులు పొందిన ముగ్గురు యువతులతో బోరబండలోని వారి ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారు.
యువతులను తీసుకుని గురువారం ఎర్రగడ్డ ఛాతి దవాఖానా సమీపంలోని బస్టాప్లో నిలబడి ఉండగా విశ్వసనీయ సమాచారం అందుకున్న నార్త్జోన్ టాస్క్పోర్స్ పోలీసులు ముగ్గురు యువతులతో పాటు అతియార్ మొండల్ అలియాస్ షాబుద్దీన్ను పట్టుకున్నారు. విచారణలో వారిచ్చిన సమాచారం మేరకు బోరబండలోని ఖుసుర్దాస్ నూర్మొహ్మద్ కొలిబా, నహీదా ఖుసుర్దాస్తో పాటు ముషరష్ సర్దార్ ను కూడా అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ నిమిత్తం ఎస్.ఆర్.నగర్ పోలీసులకు అప్పగించారు.