వరంగల్ : భార్యపై ఇనుప రాడ్డుతో దాడి చేసి హత్యాయత్నం చేసిన భర్తకు మూడు సంవత్సరాల జైలుశిక్ష విధిస్తూ న్యాయమూర్తి బి.శ్రీనివాసులు బుధవారం తీర్పు ఇచ్చారు. వివరాల్లోకి వెళ్తే..జిల్లాలోని రేగొండ మండలం నిజాంపల్లి శివారు గాంధీనగర్కు చెందిన దండెబోయిన ఎల్లక్క, జనార్దన్ భార్యా భర్తలు.
కొంత కాలంగా వ్యసనాలకు లోనైన జనార్దన్ అకారణంగా భార్యను వేధిస్తూ ఉండేవాడు. 26-5-2017 రోజునకూడా భార్యను హత్య చేయాలనే ఉద్దేశంతో ఇనుపరాడ్డుతో దాడికి పాల్పడ్డాడు. సమయానికి వారి కొడుకు వచ్చి తల్లిని కాపాడాడు. భార్య ఫిర్యాదుపై అప్పటి రేగొండ సబ్ ఇన్స్పెక్టర్ సధాకర్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేశారు. కోర్టు డ్యూటీ ఆఫీసర్ వి.రవీందర్ 8 మంది సాక్షుల్ని కోర్టు లో ప్రవేశ పెట్టారు.
ఇంచార్జి పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీనివాస రావు ఈ కేసు వాదించారు. నిందితుడు జనార్దన్ నేరం చేశాడని భావించిన ప్రిన్సిపాల్ సబ్ కోర్టు న్యాయమూర్తి మూడు సంవత్సరాల జైలుశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు.