నాగర్కర్నూల్ : ఆస్తి తన పేరిట రాయడానికి అంగీకరించకపోవడంతో ఓ మహిళ తన భర్తను కడతేర్చిన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలంలోని అయ్యవారిపల్లిలో చోటుచేసుకొంది.
పోలీసుల కథనం ప్రకారం..అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన చింతల సైదయ్య (34) పదేండ్ల కిత్రం హైదరాబాద్కు చెందిన సోనీని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఏడాది క్రితం తనకున్న మూడెకరాల్లో ఎకరా భూమిని రూ.19 లక్షలకు విక్రయించాడు. మొత్తం డబ్బుతో పాటు ఇతర ఆస్తులు తనకే చెందాలంటూ భర్తతో సోనీ గొడవపడుతోంది. ఈ క్రమంలోనే సోనీ తల్లిదండ్రులు అయ్యవారిపల్లి గ్రామానికి వచ్చారు. బాండు పేపరుపై ఆస్తి మొత్తం తన పేర రాయాలని సోనీ, భర్త సైదయ్యతో గొడవపడింది. ఆయన ససేమిరా అనడంతో ఆగ్రహంతో సోనీ, ఆమె తల్లిదండ్రులు సైదయ్యను గొంతు నులిమి హత్య చేసినట్లు ఎస్సై శేఖర్ గౌడ్ తెలిపారు.
సైదయ్యకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుడి సోదరి సైదమ్మ ఫిర్యాదు మేరకు భార్య సోనీ, అత్త జ్యోతి, మామ కృష్ణపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై పేర్కొన్నారు. ఇది ఇలా ఉండగా సోనీ అచ్చంపేట మండలం చెన్నారం గ్రామానికి చెందిన గుద్దటి లక్ష్మయ్య తో వివాహేతర సంబంధం పెట్టుకొని భర్తను కడతెరిచినట్లు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపారు.