భోపాల్ : మధ్యప్రదేశ్లో దారుణం జరిగింది. ఇండోర్ జిల్లాలో మహిళపై భర్తతో పాటు అతడి స్నేహితులు నలుగురు సామూహిక లైంగిక దాడికి పాల్పడి తీవ్రంగా హింసించిన ఘటన ఆదివారం వెలుగుచూసింది. తీవ్ర కలకలం రేపిన ఈ ఘటనలో అయిదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. భర్తతో పాటు నలుగురు వ్యక్తులు తనతో అసహజ శృంగారానికి పాల్పడటంతో పాటు తన ప్రైవేట్ భాగాలను సిగరెట్లతో కాల్చారని బాధితురాలు ఆరోపించింది.
లైంగిక దాడిని ప్రతిఘటించడంతో తనను చంపుతామని నిందితులు బెదిరించారని ఆమె తెలిపింది. ఇండోర్లోని షిప్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫాంహౌస్లో నవంబర్ 2019 నుంచి అక్టోబర్ 2021 మధ్య ఈ దారుణం చోటుచేసుకుందని పోలీసులు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చత్తీస్ఘఢ్కు చెందిన బాధితురాలు ఇండోర్కు చెందిన నిందితుడిని మ్యాట్రిమోనియల్ సైట్లో కలిసిన అనంతరం పెండ్లి చేసుకుంది.
కాగా నిందితుడికి అప్పటికే వివాహమైంది. ఇక భర్త అరాచకాలకు విసిగిన బాధితురాలు ఫాంహౌస్ నుంచి తప్పించుకుని చత్తీస్ఘఢ్లోని పుట్టింటికి తిరిగి వెళ్లింది. మహిళకు హాని తలపెట్టే ఉద్దేశంతో బాధితురాలి పుట్టింటికి కూడా నిందితుల్లో ఒకరు వెళ్లారని పోలీసులు తెలిపారు. మధ్యప్రదేశ్, చత్తీస్ఘఢ్లోని వివిధ ప్రాంతాల్లో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.