బెంగళూరు: ప్రేయసితో బ్రేకప్ అయిన ఒక వ్యక్తి కోపంతో పలు వాహనాలు ధ్వంసం చేశాడు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా అతడ్ని గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ ఘటన జరిగింది. 27 ఏండ్ల వ్యక్తి, ప్రియురాలి మధ్య బ్రేకప్ అయ్యింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన అతడు కోపం, అసహనంతో బెంగళూరు వెస్ట్ జోన్ ప్రాంతంలో పలు కార్ల అద్దాలు పగులగొట్టి వాటిని ధ్వంసం చేశాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీల ఫుటేజ్ను పరిశీలించి నిందితుడ్ని గుర్తించి శుక్రవారం అరెస్ట్ చేశారు. పోలీసులు అతడ్ని ప్రశ్నించగా ముందు రోజు ప్రేయసితో బ్రేకప్ వల్ల మనస్తాపానికి గురై కోపంతో ఇలా చేసినట్లు చెప్పాడు. దీంతో ఆ వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.