మన్సూరాబాద్ : గుండె నొప్పితో బాధపడుతున్న ఓ వ్యక్తి దవాఖానలో చికిత్స పొందుతూ కరెంటు వైర్లను నోటిలో పెట్టుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సదరు వ్యక్తి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ అశోక్రెడ్డి కథనం ప్రకారం..
నల్గొండ జిల్లా, నకిరేకల్ మండలం, కడపర్తి గ్రామానికి చెందిన తిరుగుడు సైదులు (48) వృత్తిరీత్య కూలీ పని చేస్తుంటా డు. గుండెనొప్పి కారణంగా 2018 లో ఆయనకు స్టంట్స్ వేశారు. నాటి నుంచి మందులు వాడుతున్నాడు. ఈనెల 20న సైదులుకు తిరిగి గుండె నొప్పి వచ్చింది. అతడిని వెంటనే చికిత్స నిమిత్తం నకిరేకల్లోని శ్రీకృష్ణ దవాఖానలో చేర్పించారు.
అక్కడి వైద్యుల సూచనల మేరకు 21న ఎల్బీనగర్ కామినేని దవాఖానలో చేర్చారు. కామినేని వైద్యులు సైదులుకు ఐసీయూలో చికిత్సను అందజేస్తున్నారు. దవాఖానలో చికిత్స పొందుతున్న సైదులు బుధవారం ఉదయం తెల్లవారు జామున 4 గంటల సమయంలో బాత్రూమ్లోకి వెళ్లాడు.
బాత్రూమ్లోని ట్యూబ్లైట్కు కనెక్ట్ చేసిన విద్యుత్ వైర్లను తీసుకుని నోట్లో పెట్టుకున్నాడు. దీంతో విద్యుత్షాక్ తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. బాత్రూమ్ కంటూ వెళ్లిన సైదులు ఎంతకీ తిరిగి రాకపోవడంతో ఐసీయూలో విధులు నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది బాత్రూమ్లోకి వెళ్లి చూడగా మృతి చెంది ఉన్నాడు.
విషయాన్ని తెలుసుకుని దవాఖానకు చేరుకున్న ఎల్బీనగర్ పోలీసులు సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న వ్యక్తి మృతికి గల కారణాలపై పోలీసులు ఆరాతీస్తున్నారు. మృతుడి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.