చండీగఢ్: కెనడా స్టూడెంట్ వీసా ఆలస్యాన్ని భరించలేక ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే అతడు మరణించిన రెండు రోజుల తర్వాత వీసా వచ్చింది. హర్యానాలోని కురుక్షేత్ర జిల్లాలో ఈ విషాద సంఘటన జరిగింది. షహబాద్ సబ్ డివిజన్లోని గూర్ఖా గ్రామానికి చెందిన వికేశ్ సైనీ అలియాస్ దీపక్ డిగ్రీ పూర్తి చేశాడు. దీంతో కెనడా వెళ్లి చదువుకుని అక్కడ స్థిరపడాలని నిర్ణయించుకున్నాడు. దీనికి అతడి తల్లిదండ్రులు కూడా అంగీకరించారు.
దీపక్ కొన్ని నెలల కిందట స్నేహితులతో కలిసి కెనడా స్టూడెంట్ వీసా కోసం దరఖాస్తు చేశాడు. ఇటీవల వారికి వీసాలు వచ్చాయి. అయితే తనకు వీసా రాకపోవడంపై అతడు దిగులు చెందాడు. దీంతో జన్సా సమీపంలోని కాలువలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
మరోవైపు దీపక్ కనిపించకపోవడంతో తల్లిదండ్రులు వెతకడంతోపాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం కాలువ వద్ద అతడి బైక్, చెప్పులను గుర్తించారు. దీంతో గజ ఈతగాళ్ల సహాయంతో గాలించగా మృతదేహం లభించింది. పోస్ట్మార్టం అనంతరం దీపక్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
అయితే గురువారమే దీపక్ ఇంటికి వీసా వచ్చిందని ఆ గ్రామ మాజీ సర్పంచ్ గుర్నామ్ సింగ్ తెలిపాడు. అప్పటికే అతడు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పాడు. పోలీసులు ఆ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.