నల్లగొండ : చిన్న వయస్సులో తండ్రి మండలించాడని మనస్థాపంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయిన మైనర్ బాలుడిని గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు జిల్లా యాంటీ హ్యూమాన్ ట్రాఫికింగ్ పోలీసులు. మిస్సింగ్ కేసులను ఛేదించడం లక్ష్యంగా డిఐజి ఏ.వి. రంగనాధ్ నేతృత్వంలో పెండింగ్లో ఉన్న కేసులన్నింటిని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ బాధిత కుటుంబాలలో సంతోషాలు నింపుతున్నారు జిల్లా పోలీసులు.
ఇందులో భాగంగా సోమవారం తండ్రి మందలించడంతో ఇంటి నుంచి వెళ్లిపోయిన బాలుడిని అదనపు ఎస్పీ శ్రీమతి నర్మద సమక్షంలో కుటుంబ సభ్యులకు అప్పగించారు.
జనవరి 2021లో నల్లగొండ జిల్లా చిన్న అడిశర్లపల్లి గ్రామానికి చెందిన 17 సంవత్సరాల కుర్రా ఆంజనేయులు తన తండ్రి మండలించాడని మనస్థాపం చెంది ఇంట్లో నుంచి వెళ్లిపోగా కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆ బాలుడు హైదరాబాద్ బి.ఎన్.రెడ్డి నగర్లో ఒక హోటల్లో పని చేస్తున్నట్లుగా గుర్తించి నల్లగొండకు తీసుకువచ్చి సోమవారం కుటుంబ సభ్యులకు అప్పగించారు. తక్కువ సమయంలో ఇంట్లో నుంచి వెళ్లిపోయిన బాలుడిని గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించడంలో సమర్థవంతంగా పని చేసిన ఏ.హెచ్.టి.యు. ఇంచార్జ్ రాంబాబు, సిబ్బంది నర్సింహా, మధు, నజీర్, బాలయ్య, సాయి సందీప్, జ్యోతిలను డిఐజి రంగనాధ్, అదనపు ఎస్పీ నర్మద అభినందించారు.